రామ్మూర్తినే పట్టించుకోని బాబు

10 Apr, 2019 11:16 IST|Sakshi
అజ్ఞాతంలో ఉన్న చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి (లుంగీతో ఉన్న వ్యక్తి)

 చెల్లికి ప్రమాదం జరిగినా పరామర్శించలేదు

వైఎస్సార్‌ సీపీ గెలిచే మొదటి సీటు మంగళగిరి: నార్నె శ్రీనివాసరావు

పట్నంబజారు (గుంటూరు) : తమ్ముళ్లూ.. తమ్ముళ్లూ అని జపం చేసే నారా చంద్రబాబునాయుడు సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడు ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోలేదని.. ఆయన్ను నమ్మి మోసపోవద్దని వైఎస్సార్‌ సీపీ నాయకుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తోడబుట్టిన చెల్లెలికి యాక్సిడెంట్‌ అయినా చంద్రబాబు కనీసం పరామర్శించిన పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. మంగళవారం గుంటూరులో నార్నె శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పార్టీలో అందరూ చీటర్లేనని.. సుజనాచౌదరి, సీఎం రమేష్‌ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబును నమ్మితే.. ఫ్యాంటు, చొక్కా విప్పి రోడ్డుపై నిలబెడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ చంద్రబాబుకు బినామీ అని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు నారా లోకేశ్‌ ఒక శుంఠ అని, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ గెలిచే మొట్టమొదటి స్థానం మంగళగిరి అని స్పష్టం చేశారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఆయనది దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. ప్రజలు ఎంతో గౌరవించే ఎన్టీఆర్‌ను ‘వాడు, వీడు’ అని సంబోధించటం సిగ్గుచేటన్నారు.  తన నుంచి ‘స్టూడియో ఎన్‌’ ఛానల్‌ను తీసుకున్న చంద్రబాబు డబ్బులు ఇవ్వలేదని, బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో సైతం బాబు కాసుల కోసం కక్కుర్తి పడతారన్నారు. చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తథ్యమని జోస్యం చెప్పారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిమ్స్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ భీమనాధం భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు