ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్‌

1 Jun, 2019 01:28 IST|Sakshi
ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్‌ను అభినందిస్తున్న సీఎం కేసీఆర్‌

అధికారిక పత్రాల అందజేత

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా కె.నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడం, శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నవీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వి.నర్సింహాచార్యులు ప్రకటించారు.నవీన్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.హెచ్‌.మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కె.పి.వివేకానంద్, బాల్క సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం నవీన్‌ గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ‘ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.రామారావుకు ధన్యవాదాలు.. నాపై నమ్మకంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. టీఆర్‌ఎస్‌ ప్రతిష్ట పెంపొందించేందుకు ఎమ్మెల్సీగా నా వంతుగా బాధ్యతతో, అంకితభావంతో పనిచేస్తా. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’అని నవీన్‌ అన్నారు.  

నవీన్‌రావుకు సీఎం కేసీఆర్‌ అభినందనలు 

కాగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుర్మయ్యగారి నవీన్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నవీన్‌రావుకు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు మంత్రి చామకూర మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 

మరిన్ని వార్తలు