రాఫెల్‌ రగడ.. మరో కీలక నేత రాజీనామా

29 Sep, 2018 11:07 IST|Sakshi

ఎన్సీపీకి జనరల్‌ సెక్రటరీ రాజీనామా

మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఫలితం

సాక్షి, ముంబై : రాఫెల్‌ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు మరో ఎదురుదెబ్బ తలిగిలింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ మునాఫ్‌ హకీమ్‌ ఎన్సీపీకి శుక్రవారం రాజీనామా చేశారు. రాఫెల్‌ కుంభకోణంపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శరద్‌పవార్‌ పవార్‌ భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే. 

రాఫెల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవని పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన పవార్‌ ఓ మరాఠి న్యూస్‌ చానల్‌తో మాట్లాడుతూ.. యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏది ఏమైనా యుద్ధ విమానాల ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన పేర్కొన్నారు. (రాఫెల్‌ డీల్‌పై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు)

కాగా, పవార్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుడు, ఎంపీ తారీఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా.. మునాఫ్‌ హకీమ్‌ కూడా అదే బాటలోనే నడిచారు. పార్టీ సభ్యత్వానికి, జనరల్‌ సెక్రటరీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన తారీఖ్‌కు మాటమాత్రమైనా చెప్పకుండా రాఫెల్‌ ఒప్పందంపై అనుకూలంగా మాట్లాడిన పవార్‌పై హకీమ్‌ నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మాటలు ఎన్సీపీ ప్రతిష్టను దిగజార్చేదిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

(చదవండి : రాఫెల్‌ డీల్‌ వ్యాఖ్యలు: సీనియర్‌ ఎంపీ రాజీనామా)

మరిన్ని వార్తలు