‘అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా’

28 Sep, 2019 20:01 IST|Sakshi

ముంబై : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) కీలక నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు గల కారణాలను వివరించారు. తన వల్ల మామయ్య శరద్‌ పవార్‌కు అప్రతిష్ట రాకూడదన్న కారణంగానే తాను రాజీనామా చేశానని అజిత్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. శరద్‌ పవార్‌తో సంబంధాలు బెడిసి కొట్టడం వల్లే రాజీనామా చేశారన్న ఊహాగానాలు కొట్టిపడేశారు.

(చదవండి : శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు)

శరద్ పవార్‌కు కో ఆపరేటివ్ బ్యాంకుతో ఎలాంటి సంబంధమూ లేదని, అయినా శరద్ పవార్‌ను ఇందులోకి ఎందుకు లాగారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శరద్ పవార్ కారణంగానే ఇంత ఉన్నత స్థితికి తాను చేరుకున్నానని స్పష్టం చేశారు. ‘మనీ ల్యాండరింగ్‌ కేసులో షరద్‌ను పేరును చేర్చారనే భాధతోనే నా రాజీనామా పత్రాన్ని శుక్రవారం స్పీకర్‌ వ్యక్తిగత సహాయకుడికి అందిచాను. ఎవరిని సంప్రదించకుండా రాజీనామా చేసినందుకు క్షమించాలి. షరద్‌ పవార్‌ నాకు బంధువు కావడం వల్లే ఆయనను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు’  అని అజిత్‌ ఆరోపించారు. 

(చదవండి : అజిత్‌ రాజీనామా ఎందుకు?)

 కో- ఆపరేటివ్ బ్యాంకులు రైతులకు రుణాలనిస్తూ సహాయం చేస్తుంటాయని, అయినా సరే ఒక్కోసారి రుణాలు పక్కదారి పడుతుంటాయని అన్నారు. అయినా, కేవలం 11,000 కోట్ల మాత్రమే డిపాజిట్ ఉండే బ్యాంకులో 25 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని అజిత్ పవార్ ప్రశ్నించారు. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్‌సీపీ చీఫ్‌, మాజీ సీఎం శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరరెక్టర్‌(ఈడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు