లోకేశా! అది మానవమాత్రులకు సాధ్యం కాదు..

24 Mar, 2019 21:31 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ బాబు ప్రచారం మూడు జోకులు.. ఆరు నవ్వులుగా దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రచారానికి వచ్చిన ప్రజలను, నెటిజన‍్లను వచ్చిరాని తెలుగుతో.. విషయాలపై అవగాహన రాహిత్యంతో లోకేష్‌ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. పలుమార్లు తన ప్రసంగాలతో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు.

అవగాహన లేకుండా ఆవేశంగా మాట్లాడి పప్పులో కాలేశారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. దీంతో లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, అక్కడున్న వాళ్లు పట్టపగలే చుక్కల వైపు చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. లోకేశా! అది మానవమాత్రులకు సాధ్యం కాదు... దేవుడా!.. తెలంగాణలో అసలు సముద్రమేలేదు కదయ్యా!!... చంద్రబాబు అమరావతి కడితే కేసీఆర్‌ తీసుకుపోతాడని అందుకే కట్టడంలేదు.. అంటూ లోకేష్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు