తర్వాతి ప్రధాని ఎవరో చెప్పడం కష్టమే!

27 Dec, 2018 03:57 IST|Sakshi
బాబా రామ్‌దేవ్‌

యోగా గురు బాబా రామ్‌దేవ్‌

మదురై: ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే తర్వాతి ప్రధాన మంత్రి ఎవరనేది చెప్పడం కొంచెం కష్టమే అని యోగా గురు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. రామేశ్వరంలో జరుగుతున్న భారత్‌ స్వాభిమాన్‌ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మంగళవారం మదురై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అవుతారని చెప్పడం కష్టమన్నారు. ‘మాకు ఎలాంటి రాజకీయ లేదా మతతత్వ ఎజెండా లేదు. మేము ఆధ్యాత్మిక భారతాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకుంటున్నాం.

భారతదేశాన్ని హిందూ దేశంగా లేదా మతతత్వ దేశంగా చూడాలనుకోవడం లేదు’ అని అన్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకపోతే బీజేపీ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోతుందని రామ్‌దేవ్‌ బాబా పేర్కొన్నారు. యూపీలోని బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడిపై మాట్లాడిన బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా వ్యాఖ్యలపై మాట్లాడుతూ, భారత్‌ను మతపరమైన అసహ న దేశంగా చిత్రీకరిస్తూ, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని బాబా మండిపడ్డారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసుల హత్యల కంటే గో హత్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నసీరుద్దీన్‌ వ్యాఖ్యానించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు