‘సోనూ నిగమ్‌ను చంపాలని చూశారు’

16 Jan, 2019 10:33 IST|Sakshi
నిలేశ్‌ రాణే (పాత చిత్రం)

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే కుమారుడు, మాజీ ఎంపీ నిలేశ్‌ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ను శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే చంపాలని చూశారని ఆరోపించారు. దీనికోసం పలుమార్లు ప్రయత్నాలు కూడా జరిగాయని అన్నారు. అసలు బాల్‌ఠాక్రే, సోనూ నిగమ్‌ కుటుంబాలు మధ్య సంబంధం ఏమిటని తనను అడగవద్దని కోరారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శివసేన పార్టీ నాయకుడు వినాయక్‌ రౌత్‌ మాట్లాడుతూ.. నారాయణ్‌ రాణేపై పలు వ్యాఖ్యలు చేశారు. వినాయక్‌ను ఉద్దేశించే నిలేశ్‌ ఈవిధమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలస్తోంది.

ఇంకా నిలేశ్‌ మాట్లాడుతూ.. ‘మా కుటుంబం ఎప్పుడు బాల్‌ఠాక్రేను రాజకీయ విషయాల్లో తప్పుపట్టలేదు. కానీ కొందరు మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా చేస్తే నేను కూడా కొన్ని విషయాలు బయటపెట్టాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు. శివసేనలో ఉన్నప్పుడు నారాయణ్‌ రాణే ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల..  ఆయన కుటుంబం శివసేనకు దూరమైంది.

మరిన్ని వార్తలు