మోదీ కీలక భేటీ: నిర్మలా సీతారామన్‌ ఎక్కడ?

9 Jan, 2020 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ముఖ్య ఆర్థికవేత్తలతో​ భేటీ అయ్యారు. బడ్జెట్‌ రూపకల్పన, నిధుల కేటాయింపు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పియూష్‌ గోయల్‌, నీతి ఆయోగ్‌  వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్ పలువురు ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్‌  డెబ్రాయ్‌కు కూడా ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన సమస్యలతోపాటు ఆర్థిక వ్యవస్థ, సామాజిక రంగం,  స్టార్టప్‌ల వంటి అంశాలపై ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ  చర్చించినట్టు తెలుస్తోంది.

అయితే కీలకమైన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లేకపోవడంపై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. కీలకమైన సమావేశానికి ఆర్థికమంత్రి లేకపోవడం  ఏంటని ప్రశ్నించారు. అసలిక్కడ ఏం జరుగుతోందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆమెకు ఆసక్తిలేదాఅని ట్వీట్‌ చేశారు. కాగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019–20 ఏడాదికి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు