మోదీపై పోటి.. ఆ రైతుకు 787 ఓట్లు

23 May, 2019 20:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసిన నిజామాబాద్‌ జిల్లా ఎర్గట్లకు చెందిన రైతు సున్నం ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణకు చెందిన 24 మంది రైతులు నామినేషన్‌ వేశారు. అయితే అందులో 23 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా సున్నం ఇస్తారి అనే వ్యక్తి మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన 787 ఓట్లు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో మూడు లక్షల అరవై వేలకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు.

>
మరిన్ని వార్తలు