రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్క్రాప్‌లా తయారైంది

16 Dec, 2019 02:14 IST|Sakshi

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌

సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌అర్బన్‌): రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ స్క్రాప్‌లా తయారైందని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. భరతమాతను 3 ముక్కలు చేసి పాపాన్ని ఆ పార్టీ మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం లో మాట్లాడుతూ, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. ఏపీలో సీఎం జగన్‌ పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించి పుణ్యం కట్టుకున్నారని అభినందించారు.

పౌరసత్వ బిల్లుతో దేశంలోని మైనారిటీలకు ఇబ్బందులు ఉండబోవన్నారు. దీనికి వ్యతిరేకంగా ఓటేసి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మైనారిటీలైన హిందువులు ఊచకోతకు గురవుతున్నారని, శరణార్థులుగా మారిన వారికోసం ఈ చట్టాన్ని తెచ్చామని చెప్పారు. ఎంఐఎంకు ఓ వర్గం గంప గుత్తగా ఓట్లు వేస్తున్నారని, రాష్ట్రంలోని మైనార్టీలందరికీ సీఎం కేసీఆర్‌ ఒవైసీ కళ్లద్దాలు పెట్టి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు