కాంగ్రెస్‌తో పొత్తుకు ఇక స్వస్తి

19 Mar, 2019 03:19 IST|Sakshi

ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీలో విపక్ష కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) షాకిచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌తో తాము ఎలాంటి పొత్తు కుదుర్చుకోవడం లేదని స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో వెనక్కితగ్గబోమని తేల్చిచెప్పింది. పొత్తు విషయంలో కాంగ్రెస్‌ సాగదీత వైఖరి అవలంబించడంతో ఆప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఆప్‌ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ మాట్లాడుతూ..‘పొత్తు విషయంలో కాంగ్రెస్‌ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యహరించడంతో మేం ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. మా కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో సానుకూలంగానే వ్యవహరించాం. మేం చాలాకాలం వేచిచూశాం. కానీ కాంగ్రెస్‌ నేతలు ఇష్టానుసారం ప్రకటనలు చేయడంతో పాటు మీడియాతో మాట్లాడారే తప్ప, మాతో అధికారికంగా సమావేశం కాలేదు. అంతేకాకుండా ఇటీవల చేపట్టిన మా అంతర్గత సర్వేలో ఢిల్లీలో ఆప్‌–బీజేపీల మధ్యే ప్రధాన పోటీ అని తేలింది. ఈ నేపథ్యంలో ఒక్క క్షణం కూడా వృధాచేయకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు