జీన్స్‌ తొడిగిన అమ్మాయిని ఎవరైనా పెళ్లాడతారా?

11 Dec, 2017 18:35 IST|Sakshi

మహిళల వస్త్రధారణపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

గోరఖ్‌పూర్‌ : బీజేపీకి చెందిన మరో కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌.. మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. ‘జీన్స్‌ తొడుక్కొని పెళ్లిమండపంలోకి వచ్చే ఏ అమ్మాయినైనా అబ్బాయిలు పెళ్లాడతారా?’ అని విద్యార్థులను ప్రశ్నించారు. గోరఖ్‌పూర్‌ మఠానికి అనుబంధంగా నూతనంగా ఏర్పాటుచేసిన విద్యా సంస్థ శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్యాంటు తొడిగినోడు మతగురువు అవుతాడా?
కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి హోదాలో విద్యాసంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యపాల్‌.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..  ‘జీన్స్‌ ప్యాంటు వేసుకునే ఒకడొచ్చి ‘నేను మతగురువుగా ఉంటాను’ అంటే మనం అంగీకరిస్తామా? ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. అదేవిధంగా వధువు జీన్స్‌ ధరించి పెళ్లి మండపంలోకి వస్తే ఏ అబ్బాయైనా చచ్చినా ఆమెను పెండ్లి చేసుకోడు’ అని సింగ్‌ వ్యాఖ్యానించారు.

అదే వేదికపై సీఎం యోగి..
కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌ ప్రసంగించిన వేదికపైనే యూపీ సీఎం యోగి ఆదిత్యానథ్‌ ఆసీనులై ఉండటం గమనార్హం. యోగి.. ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్‌పూర్‌ మఠానికి అనుబంధంగా నడిచే మహారాణా ప్రతాప్‌ శిక్షా పరిషత్‌(ఎంపీఎస్‌పీ) విద్యాలయం శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు