కాంగ్రెస్‌కు ఆ సత్తాలేదు : సింధియా

11 Mar, 2020 15:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ఎదుర్కొనే సత్తా ప్రస్తుతమున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి లేదని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సింధియా బుధవారం ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కమళం గూటికి చేరారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే తన అంతమ లక్ష్యమని, దాని కోసమే బీజేపీలో చేరుతున్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు తనను ఎంతో ఆకర్షించాయని చెప్పారు. నాయకత్వలేమితో, వరకు ఓటములతో, పార్టీలో కుమ్ములాటతో సతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీలో ప్రజలకు సేవచేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పార్టీని ముందుండి నడిపిస్తూ, ప్రచారాన్ని భుజానకెత్తుకుని మోస్తున్న యువతకు అధిష్టానం మొండిచేయి చూపుతోందని విమర్శించారు. (బీజేపీలో చేరిన సింధియా)

అలాగే మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సైతం సింధియా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కమల్‌నాథ్‌ సర్కార్‌ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి చేసేందుకు బీజేపీకి తనకు అవకాశం కల్పించిందని, ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా నాయకత్వంలో దేశాభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వారి నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో 18 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని.. పార్టీలో తనకు తగిని ప్రాతినిధ్యం లభించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు