అవిశ్వాస తీర్మానం; ఆ పార్టీలు ఎటువైపు?

19 Mar, 2018 10:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ, టీడీపీలు ఇచ్చిన అవిశ్వాసతీర్మానాలు నేడు లోక్‌సభ ముందుకు రానున్నాయి. ముందు టీడీపీ తీర్మానం చర్చకు వచ్చినా మద్దతు ఇస్తామని వైఎస్‌ జగన్‌ ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెస్‌, సీపీఎంలు సైతం అవిశ్వాసానికి బేషరతుగా మద్దతు పలికాయి. అయితే ఎన్డీఏ ఏతర పార్టీల్లో అత్యధికులు అవిశ్వాసానికి మద్దతు పలకగా, ఎన్డీఏ మాజీ మిత్రులు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

పార్లమెంట్‌లో 28 మంది ఎంపీలు(20 లోక్‌సభ, 8 రాజ్యసభ) ఉన్న బిజూ జనతాదళ్‌(బీజేడీ) ఇప్పటికీ తన వైఖరిని వెల్లడించలేదు. ఆపార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ పలు సందర్భాల్లో బీజేపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ, తృతీయ లేదా ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరిక గురించి ఇంకా ఆలోచించలేదని ఇటీవల అన్నారు. కీలకమైన అవిశ్వాసం విషయంలోనూ నవీన్‌ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటు లోక్‌సభలో 14 మంది ఎంపీలు (అందులో ముగ్గురు జంప్‌జిలానీలు) ఉన్న టీఆర్‌ఎస్‌(ఏన్డీఏ కానప్పటికీ) కూడా తన స్టాండ్‌ను బయటపెట్టలేదు. కాగా, గులాబీ ఎంపీలు సభకు గౌర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకేలు మళ్లీ..?: రిజర్వేషన్ల అంశంతో టీఆర్‌ఎస్‌, తమిళనాడు సమస్యలపై అన్నాడీఎంకే ఎంపీలు లోక్‌సభలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం శుక్రవారమే సభ ముందుకు వచ్చిన సందర్భంలోనూ.. టీఆర్‌ఎస్‌, ఏఐఏడీఎంకేలు నిరసనలు కొనసాగించడం, సభ ఆర్డర్‌లో లేదన్న కారణంగా స్పీకర్‌ నీటీసులను తిరస్కరించడం తెలిసిందే. అటుపై వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విడివిడిగా ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు సోమవారం సభ ముందుకు రానున్నాయి. అయితే మొన్నటిలాగే నేడు కూడా ఆయా పార్టీలు (వారికున్న హక్కుల మేరకు) నిరసనలకు దిగితే.. మళ్లీ సభలో గందరగోళం తలెత్తేఅవకాశముంది. కాగా, సమావేశాలకు గైర్హాజరయ్యే సభ సజావుగా ఉన్నప్పుడు మాత్రమే అవిశ్వాసంపై చర్చ చేపట్టాలన్న నియమం అందరికీ తెలిసిందే. ఇక ఏఐఏడీఎంకే.. తాను ఎన్డీఏలో లేకపోయినప్పటికీ సర్కారుకు మద్దతిస్తామని చెబుతోంది. మొన్నటిదాకా బీజేపీపై శివాలెత్తిన శివసేన.. తాజాగా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటువేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు