ఢిల్లీలోనూ మహాకూటమి కథ కంచికే!

25 Feb, 2019 13:37 IST|Sakshi

కాంగ్రెస్‌ మాతో పొత్తుకు సిద్ధపడటం లేదు

మేం ఒంటరిగా పోటీ చేస్తాం

ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేం‍ద్రమోదీ సర్కారును గద్దె దించేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని తీర్మానించుకున్నా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని పక్కనబెట్టి ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఢిల్లీలోనూ విపక్ష మహాకూటమికి చుక్కెదురైంది. తమతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధపడటం లేదని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం స్పష్టం చేశారు.

ఢిల్లీలో మహాకూటమి (మహాఘట్‌బంధన్‌) ఏర్పాటు కాకపోవడానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీ తమతో పొత్తుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదని, ఈ విషయంలో కాంగ్రెస్‌ దృఢనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోందని కేజ్రీవాల్‌ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నరేంద్రమోదీ-అమిత్‌ షా ద్వయాన్ని అధికారంలోంచి దింపేయడమే దేశముందున్న అతిపెద్ద సవాలు అని, ఆ సవాలులో భాగంగా తమకు బద్ధవిరోధి అయిన కాంగ్రెస్‌తో పొత్తుకు తాము సిద్ధపడినా.. ఆ పార్టీ మాత్రం అందుకు అంగీకరించడం లేదని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు