పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ఆలోచన లేదు

10 Jul, 2019 17:41 IST|Sakshi

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియ శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావలంటే జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు  చేయాల్సి ఉంటుందనీ.. అలాంటిది ఏదీ చేయలేదని చెప్పారు.

అలాగే పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకవచ్చే అంశంపై అధ్యయనం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని రెవెన్యూ శాఖ తెలిపినట్లు మంత్రి చెప్పారు. రాజ్యాంగంలోని ఏడో అధికరణం ప్రకారం పొందుపరిచిన జాబితాలో పెట్రోలియం క్రూడ్‌, హై స్పీడ్‌ డీజిల్‌,  మోటర్‌ స్పిరిట్‌, గ్యాస్‌, విమానాలకు వినియోగించే ఇంధనంపై సుంకం విధించే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉ‍న్నట్లు మంత్రి తెలిపారు.  
 

మరిన్ని వార్తలు