ఫైనల్‌ లిస్ట్‌

29 Mar, 2019 07:51 IST|Sakshi

పూర్తయిన లోక్‌సభ నామినేషన్ల ఉపసంహరణ

నాలుగు సెగ్మెంట్లకు తేలిన అభ్యర్థులు

బరిలో మొత్తం 78 మంది  

హైదరాబాద్‌ 15, సికింద్రాబాద్‌ 28, మల్కాజిగిరి 12, చేవెళ్ల 23

సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో మరో ఘట్టం ముఖ్య ముగిసింది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో బరిలో నిలిచిన ఫైనల్‌ అభ్యర్థుల లెక్క తేలింది. గ్రేటర్‌లోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 78 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో హైదాబాద్‌కు 15 మంది, సికింద్రాబాద్‌ స్థానానికి 28 మంది, మల్కాజిగిరికి 12 మంది, చేవెళ్ల సెగ్మెంట్‌కు 23 మంది మిగిలారు. ప్రధాన పార్టీల నుంచి హైదరాబాద్‌ బరిలో అసదుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం), పి.శ్రీకాంత్‌(టీఆర్‌ఎస్‌), భగవంతరావు(బీజేపీ), మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌(కాంగ్రెస్‌), డి.జయప్రకాశ్‌(న్యూ ఇండియా పార్టీ), రంగాచార్య(సమాజ్‌వాది ఫార్వడ్‌ బ్లాక్‌)తో పాటు మరో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.  

సికింద్రాబాద్‌ బరిలో అంజన్‌కుమార్‌ యాదవ్‌(కాంగ్రెస్‌), జి.కిషన్‌రెడ్డి (బీజేపీ), తలసాని సాయికిరణ్‌(టీఆర్‌ఎస్‌), ఎన్‌.శంకర్‌గౌడ్‌(జనసేన), ఎం.అశోక్‌కుమార్‌ (సమాజ్‌వాది ఫార్వడ్‌ బ్లాక్‌), అందుకూరి విజయ భాస్కర్‌(ఇండియా ప్రజాబంధు పార్టీ), చల్లా రామ్‌కళ్యాణ్‌ (భారతీయ అన్‌రక్షిత్‌ పార్టీ), జయప్రకాశ్‌ (న్యూ ఇండియా పార్టీ), మల్లేష్‌ (సోషలిస్ట్‌ యూనిట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా పార్టీ), నజీరుద్దీన్‌(అఖిల భారతీయ ముస్లింలీగ్‌), జె.ఎస్‌.రావు(దళిత బహుజన పార్టీ), జి.లక్ష్మీ నర్సింహారావు(తెలంగాణ ప్రజల పార్టీ), సత్యవతి (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా)తో పాటు మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
మల్కాజిగిరి స్థానానికి మర్రి రాజశేఖర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), ఎనుముల రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్‌), ఎన్‌.రాంచందర్‌రావు (బీజేపీ), చామకూర రాజయ్య(సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా టిల్లర్‌), ధర్మాసనం భానుమూర్తి (ప్రజాసత్తా పార్టీ), బూరు బాలామణి(ఇండియా ప్రజాబంధు పార్టీ), బొంగునూరి మహేందర్‌రెడ్డి(జనసేన)తో పాటు మరో ఐదుగురు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.  

నామినేషన్లు ఇలా..
హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి 24 నామినేషన్లు దాఖలు కాగా, ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 19 మందిలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన గాజుల చంద్రశేఖర్‌రావు, మాతంగి రమేశ్, డేవిడ్, సయ్యద్‌ నూరుల్లా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సికింద్రాబాద్‌ స్థానానికి 51 నామినేషన్లు దాఖలు కాగా 21 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 30లో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన శ్యామ్సన్‌బాబు, ప్రొఫెసర్‌ గల్లీ వినోద్‌ కుమార్‌ ఉపసంహరించుకున్నారు. మల్కాజిగిరి స్థానానికి 43 నామినేషన్లు అందగా 27 నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 13 మందిలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన పంబళ్ల శివరాజ్‌ తన నామినేషన్‌ పత్రాన్ని ఉపసంహరించుకున్నారు. 

మరిన్ని వార్తలు