నాకేం అభ్యంతరం లేదు: నోముల

9 Sep, 2018 13:31 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ నేత నోముల నర్సింహ్మయ్య(పాత చిత్రం)

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే జానా రెడ్డికి కొన్ని అంశాలు గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందని టీఆర్‌ఎస్‌ నేత నోముల నర్సింహ్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే మా పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి గతంలో అన్నారని వెల్లడించారు. వరద కాలువకు ఇరవై ఏండ్ల కింద శంకుస్థాపన చేస్తే మీ హయాం వరకు ఎందుకు పని పూర్తి కాలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనే రైతుబంధు కింద రూ.100 కోట్లు వచ్చాయి...జానారెడ్డి చెక్కులు పంపిణీకి వస్తే మంచిదని అన్నారు. జానారెడ్డి మాకు ప్రచారం చేసినా, మా కండువా కప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

ఇంకా మాట్లాడుతూ..‘ మా నాయకుడు కేసీఆర్‌ ఏం చెప్పినా వింటాం. కరెంటు విషయంపై మీరు(జానారెడ్డి) అప్పుడు జోష్‌లో అన్నారు. అది గుర్తు చేసుకోండి. ప్రజా తీర్పు కోసం శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. కేసీఆర్‌ కిట్‌ వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. 36 పార్టీలను తెలంగాణ కోసం ఏకం చేసిన ఘనత కేసీఆర్‌ది. మీరు ఎంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినా నిజం అదే. రైతు బీమాతో రైతు ధీమాగా ఉన్నాడు. డబుల్‌ బెడ్‌రూం గురించి మీరు కబుర్లు చెబుతున్నారు. మీ కన్నా బాగా ఇండ్లను నిర్మిస్తే దానిపై కూడా విమర్శలా..ప్రాజెక్టులు నిర్మిస్తే వాటిపై కేసులు వేస్తారు. నల్గొండ జిల్లాలో మీ కోటలు కూలడం ఖాయం. పన్నెండు సీట్లకు పన్నెండు గెలుస్తా’మని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు