కాంగ్రెస్‌తో పొత్తా.. ప్రసక్తే లేదు!

18 Jan, 2019 19:19 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: ఆప్‌ కీలక ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపై ఆమ్‌ఆద్మీ పార్టీ ఎట్టకేలకు స్పందించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో తమ పార్టీ సొంతగా పోటీచేస్తుందని, కాంగ్రెస్‌తో పొత్తు పసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఆప్‌ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ శుక్రవారం ప్రకటించారు. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా జట్టుకట్టాలన్న కాంగ్రెస్‌ ప్రతిపాదనను ఆప్‌ తిరస్కరించింది.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే తమ లక్ష్యమని, కానీ ఆ ప్రయత్నంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేది లేదని గోపాల్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి గతంలో ప్రయత్నించామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అలాంటి ప్రయత్నం చేయబోమని తేల్చిచెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో తమ పార్టీకి మంచిపట్టుందని, పార్టీ బలం పెంచుకునేందుకు ఒంటరిగా పోటీచేస్తామని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ తమకెలాంటి పోటీ కాదని పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌గా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ప్రకటించిన మరునాడే ఆప్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశ రాజధానిలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని షీలా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు