సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దయతో తాను సీఎంను కాలేదని, కాంగ్రెస్ మూలానే తనకు ఆ పదవి దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం(మే 27న) మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా విధానసౌధలో ఆయన చిత్రపటానికి కుమారస్వామి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేయబోం. సంకీర్ణ ప్రభుత్వమైనందున భాగస్వామ్య కాంగ్రెస్తో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం, ఇందుకు వారం రోజులు సమయం కావాలి. రుణ మాఫీ చేయలేని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేసేందుకూ సిద్ధం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రివర్గ ఏర్పాటు గురించి చర్చలు జరుగుతున్నాయని, అవి ఓ కొలిక్కి వచ్చాక రుణమాఫీ విషయంపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ‘ఆరున్నర కోట్ల మంది మమల్ని(జేడీఎస్)ను తిరస్కరించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దయతో నేను సీఎం అయ్యాను. కాంగ్రెస్కు నేను కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగని రాష్ట్రంలోని రైతులు ఎవరూ రుణమాఫీ విషయంలో ఆందోళన చెందవద్దు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది’ అని సీఎం కుమారస్వామి చెప్పారు. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో జేడీఎస్ రైతుల రుణమాఫీను చేర్చగా, కాంగ్రెస్ మాత్రం ఆ ఊసెత్తకుండానే బరిలో దిగింది.
మంత్రి పదవులపై విభేదాల్లేవు... కాంగ్రెస్ నేతలు హస్తిన నుంచి తిరిగి వచ్చాక మంత్రిమండలిని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య విభేదాలు లేవు. అలాంటి వార్తలన్నీ అవాస్తవమని కుమార చెప్పారు. కేబినెట్ కూర్పు సమయంలో పదవుల కోసం డిమాండ్లు వినిపించడం సహజమే, అసంతృప్తులు ఉంటారు, వారికి సర్ది చెపుతామని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షం అదేపనిగా పెట్టుకుని తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని సీఎం మండిపడ్డారు.
యెడ్డీతో మాట్లాడడమా?... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోయిందని కుమార ఆరోపించారు. కానీ, యెడ్యూరప్ప ప్రస్తుతం రుణమాఫీ విషయంపై పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై మూడురోజుల్లో నిర్ణయం చెప్పకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామనడం సిగ్గు చేటన్నారు. యెడ్డూరప్ప వ్యాఖ్యలకు ఎవరూ భయపడరని చెప్పారు. కాగా, రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష బీజేపీ నేడు(సోమవారం) రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టు సీజేతో భేటీ... ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ఆయన నివాసంలో కలిశారు. కుమార సీఎంగా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ మహేశ్వరిని మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
నేడు ప్రధాని మోదీతో భేటీ... ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అయితే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ విదేశీ పర్యటనలో ఉండటంతో వారిని కలిసే అవకాశం లేదు. ప్రధాని అపాయింట్ కోరుతూ కుమారస్వామి లేఖ రాయగా, అనుమతి లభించడంతో హస్తిన పయనమవుతున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో కూడా సమావేశమై, రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులు, సాయాలపై చర్చిస్తారు.