పంచాయతీ ఎన్నికల్లోనూ ‘నోటా’  

23 Jun, 2018 13:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గతంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనే వినియోగం

బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ బాధ్యతలు అప్పగింత

మోర్తాడ్‌(బాల్కొండ) : ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే విధానంను ఎన్నికల కమిషన్‌ అమలులోకి తీసుకు వచ్చింది. నోటాకు ఓటు గడచిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నుంచి అమలులోకి వచ్చింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది.

త్వరలో నిర్వహించబోయే పంచా యతీ ఎన్నికల్లో ఓటర్లు నోటాకు ఓటు వేసే చాన్స్‌ ను ఉపయోగించుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాకపోయినా అధికార యంత్రాంగం మాత్రం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ ఉంటే ఎలాంటి గుర్తులను కేటాయిస్తామో అనే ఆంశాన్ని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

దీంతో సర్పంచ్‌ స్థానానికి పోటీ ఉంటే కేటాయించే గుర్తులు, వార్డు స్థానాలకు పోటీ ఉంటే కేటాయించే గుర్తులను పరిగణనలోకి తీసుకుని బ్యాలెట్‌ పత్రాలను ముందస్తుంగా ముద్రించడానికి పంచాయతీ రాజ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్ర వారం నుంచి ఆరు రోజుల పాటు సర్పంచ్, వార్డు స్థానాలకు అవసరమైన బ్యాలెట్‌ల ముద్రణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆయా మండలాల అధికారులు బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు సిబ్బందిని కేటాయించారు.

ఈవోపీఆర్‌డీలు, మండల పరిషత్‌ సూపరిండెంట్‌లు, పం చాయతీ కార్యదర్శులకు ఆయా మండలాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాల ముద్రణ విధులను అప్పగించారు. జిల్లా లో 530 సర్పంచ్‌ స్థానాలతో పాటు 4,932 వార్డు స్థానాలకు ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేసిన ప్రింటింగ్‌ ప్రెస్‌లలో రెవెన్యూ డివిజన్‌ల వారీగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ఆర్డర్‌లను ఇచ్చారు.

ఏ సర్పంచ్‌ స్థానానికి ఎంత మంది, అలాగే వార్డు స్థానానికి పోటీలో ఎంత మంది ఉంటారనే విషయం నామినేషన్‌ల పరిశీలన, విత్‌డ్రాల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు తెలియదు. నామినేషన్‌ల పరిశీలన, విత్‌డ్రాలు ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల అధికారి ఫాం 9 జారీ చేస్తేనే ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనే విషయం స్పష్టం అవుతుంది

ఫాం 9 జారీ తరువాత ఎన్నికల నిర్వహణకు వారం రోజులే గడువు ఉంటుంది. తక్కువ సమయంలో బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి కాదనే ఉద్దేశంతో ముందస్తుగానే ముద్రణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో బ్యాలెట్‌ పత్రాల్లో గుర్తులను ముద్రించి ఎన్నికల కు ముందుగానే సిద్ధంగా ఉంచేవారు. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరం ఉన్న గుర్తుల వరకు బ్యాలెట్‌ పత్రాని ఉంచి అవసరం లేని గుర్తులు ఉన్న పత్రాన్ని చింపివేసేవారు.

అయితే ఇప్పుడు ప్రతి బ్యాలెట్‌ పత్రంలో నోటాకు గుర్తును కేటాయిస్తుండటంతో అంచనాలు వేసి బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. నోటాకు ఇంటూ మార్క్‌ను కేటాయించగా ప్రతి బ్యాలెట్‌లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులతో పాటు ఇంటూ మార్క్‌ ఉన్న గుర్తు ఉంటుంది.  

అంచనా ఇలా

కొన్ని బ్యాలెట్‌ పత్రాల్లో రెండు ఎన్నికల గుర్తుల తో పాటు మరోటి నోటా గుర్తు ఉంటుంది. అంటే టూ ప్లస్‌ వన్, త్రీ ప్లస్‌ వన్, ఫోర్‌ ప్లస్‌ వన్, ఇలా గరిష్టంగా 16 గుర్తులతో పాటు ఒకటి నోటాకు అవకాశం ఉంటుంది. కొన్ని స్థానాల్లోనే పోటీ ఎక్కువగా ఉంటుందని ఎక్కువ స్థానాల్లో పోటీ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో బ్యాలెట్‌ పత్రా ల ముద్రణను ముందస్తుగా చేపట్టారు.

బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు సంబంధించి వివిధ సర్పంచ్, వార్డు స్థానాలకు గతంలో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుం టున్నారు. ఒక వేళ బ్యాలెట్‌ పత్రాలు తక్కువ అని తేలితే ఇప్పుడు ముందస్తుగా ముద్రించిన వాటికి అదనంగా మరి కొన్నింటిని ముద్రిస్తే సమయం తక్కువ తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లోను నోటాకు చోటు ఇవ్వడం గ్రామాలలో చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు.   

మరిన్ని వార్తలు