బీజేపీకి గట్టి షాకిచ్చిన మిత్రపక్షం

19 Feb, 2018 10:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. మిత్రపక్షం నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌) ఎన్డీఏ కూటమికి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మణిపూర్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్‌పీఎఫ్‌ తన మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించుకోగా.. బీజేపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది.

‘త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం’అని ఆదివారం ఎన్‌పీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మురంగ్‌ ముకంగా ప్రకటించారు. మణిపూర్‌ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా.. బీజేపీకి 31 మంది ఎమ్మెల్యేలు(వీరిలో 9 మంది కాంగ్రెస్‌ నుంచి, ఒకరు ఏఐటీసీ నుంచి ఫిరాయించిన వారు), ఎన్‌పీఎఫ్‌ తరపున నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్‌పీఎఫ్‌ గనుక మద్ధతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఎదురుకావొచ్చు. 

ఇక ఆ మధ్య ఓ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బిరెన్‌ సింగ్‌ ప్రసంగిస్తూ... నలుగురు ఎన్‌పీఎఫ్‌ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్‌పీఎఫ్‌ బిరెన్‌పై విరుచుకుపడింది. ‘మమల్ని చులకన చేసిన వారితో ఇంకా కొనసాగటం సరికాదు.. మద్ధతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం’ అని ఎన్‌పీఎఫ్‌ పేర్కొంది. ఈ పరిణామాల అనంతరం ఎన్‌పీఎఫ్‌ నేతలు ఒక్కోక్కరుగా బీజేపీ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయటం ప్రారంభించారు కూడా. ఫిబ్రవరి 27 నాగాలాండ్‌ ఎన్నికల తర్వాత బీజేపీతో తెగదెంపులపై ఎన్‌పీఎఫ్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు