‘రాజధాని పేరిట వసూళ్లకు పాల్పడ్డారు’

8 Jul, 2018 11:22 IST|Sakshi

సాక్షి ప్రతినిధి: అమరావతి నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిపై ఎన్నారైలు మండిపడ్డారు. సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు హోస్ట్‌గా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో నాటా పొలిటికల్ డిబేట్(ఆంధ్ర ప్రదేశ్‌) జరిగింది. ఈ చర్చాకార్యాక్రమంలో ఎన్నారైలతోపాటు మాజీ ఎంపీలు సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి, కోరుముట్ల, ఇంకా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ తీరుపై ఎన్నారైలు, నేతలు విమర్శలు గుప్పించారు. 

అమరావతి పేరిట మోసం.. రాజధాని నిర్మాణం పేరిట తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని పలువురు ఎన్నారైలు మండిపడ్డారు. ‘అమరావతి నిర్మాణం అంటూ డబ్బు వసూలు చేశారు. ఇప్పటి వరకు లెక్క లేదు. భవనాలు కట్టలేదు. ఇది మోసం కాదా?.. నిధుల విషయంలో టీడీపీ-బీజేపీలు దొంగాట ఆడుతున్నాయి’ అని వాళ్లు పేర్కొన్నారు. 

వైసీపీ నేతల స్పందన... ‘హోదా కోసం రాజీనామా చేశాం. టీడీపీ ఎంపీలు కలిసి వస్తే కేంద్రం స్పందించేది. పోలవరం ప్రాజెక్టులో ట్రక్కు మట్టి తీయటానికి అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు’ అని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.  వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చి.. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ మిథున్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కూడా వైఎస్సార్‌ సీపీకి సమానమేనని వైసీపీ నేత శిల్పా చక్రపాణి తెలిపారు. ‘నంద్యాల లో టీడీపీ ఏం చేసిందో నాకు తెలుసు. 2016 వరకు హోదాపై మాట కూడా మాట్లాడొద్దని నాడు పార్టీ నేతలకు ఆదేశాల ఇచ్చారు’ ఆయన చక్రపాణి పేర్కొన్నారు. ‘నంద్యాల తరహా ఎన్నిక చేస్తామని టీడీపీ ప్రచారం చేస్తోంది, మరి బీజేపీ ఎందుకు అప్పుడు స్పందించలేదు??’ నారుమిల్లి పద్మజ అన్నారు.. ‘జర్మనీని హిట్లర్ నాశనము చేస్తున్నారని చుట్టూ ఉన్న వాళ్లు చెబితే జర్మన్లు నమ్మలేదు, ఇప్పుడు అమరావతిలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని’ కృష్ణ దేవరాయ తెలిపారు.

చంద్రబాబు అంటేనే మోసం... ‘చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మమ్మల్ని మోసం చేసింది. చంద్రబాబు గతంలో వాజ్‌పేయిని మోసం చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ విషయంలో అదే తీరును ప్రదర్శించారు. ఇకపై ఎప్పటికీ ఏ పార్టీ కూడా బాబును నమ్మొద్దు’ అని బీజేపీ నేత విలాస్ సూచించారు.

మరిన్ని వార్తలు