అన్నగారి ఆత్మను చంపేశాడు

9 Apr, 2019 11:33 IST|Sakshi

సాక్షి , గుంటూరు : చంద్రబాబు మాయ ముసుగు ఒక్కొక్కటిగా తొలగిపోతోంది. దివంగత నేత నందమూరి తారక రామారావు పట్ల చంద్రబాబు వైఖరి తేటతెల్లమైంది. అన్నగారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నారన్నది జగమెరిగిన సత్యమైనా.. తెలుగుదేశం పార్టీ నేతల బుకాయిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్‌ చావుకు కారకుడైన బాబును వెనకేసుకొస్తున్నారు.

తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో చంద్రబాబు సంభాషణ విన్న అన్నగారి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్టీఆర్‌ను ఏక వచనంతో  సంబోధించిన బాబు తీరును అసహ్యించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తామని, ఇప్పటికే ప్రజలు మరిచిపోయారని చంద్రబాబు అంటుంటే.. ఆవేదనతో చెమ్మగిల్లుతున్నారు. ఇలాంటి నేతకా తాము ఇప్పటి వరకు మద్దతిచ్చిందని మధన పడుతున్నారు. అన్నగారి ఆత్మను సైతం చంపేసిన చంద్రబాబుకు బుద్ధి చెబుతామని నిప్పులు కక్కుతున్నారు.   

మహానటుడు ఎన్టీ రామారావు పేరును కాలగర్భంలో కలిపేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు తరం కాదని.. వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్‌ చెప్పినట్లుగా ‘జామాత.. దశమగ్రహమే’ అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశమగ్రహాన్ని సాగనంపే రోజులు వచ్చాయని.. కాలగర్భంలోనూ కలిసిపోతాడని శాపనార్థాలు పెడుతున్నారు. అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్‌కు  వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కనిపించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్‌ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్‌ అభిమానులు భగ్గుమంటున్నారు. 

ఎన్టీఆర్‌పై బాబుది కపట ప్రేమ
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న ఎన్టీఆర్‌. ఆయన స్థాపించిన పార్టీనే లాక్కుని, ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్టీఆర్‌పై కపట ప్రేమ నటిస్తూ వచ్చారు. ఇందుకు నిదర్శనమే సామాజికి మాధ్యమాల్లో తిరుగుతున్న చంద్రబాబు, రాధాకృష్ణల సంభాషణ వీడియో. అసలు ఎన్టీఆర్‌ పేరు లేకుండా, వినిపించకుండా చేయాలను కోవడం వారి అవివేకం. ఏనాడో ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నిజ స్వరూపాన్ని గుర్తించాలి. 
–మెగలిపువ్వు నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌ అభిమాని, చెరుకుపల్లి  

మరిన్ని వార్తలు