గద్దెనెక్కించేది వృద్ధ ఓటరే!

22 Mar, 2019 11:33 IST|Sakshi

ఈ ఎన్నికల్లో కోటీ యాభై లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ యువ ఓటర్ల సంఖ్య గణనీ యంగా పెరిగిందని, చాలా నియోజకవర్గాల్లో వారే నిర్ణయాత్మక శక్తిగా ఆవిర్భవించనున్నారనేది ఎన్నికల పండితుల మాట. పంజాబ్‌లో మాత్రం ఈ సీన్‌ రివర్స్‌ అయింది. అక్కడ వృద్ధ ఓటర్లే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. పంజాబ్‌లో 60 ఏళ్లు పైబడిన ఓటర్లు 30 లక్షల మంది ఉన్నారు. వీరుకాక మరో 5,916 మంది వందేళ్లు దాటిన వారున్నారు.

చండీగఢ్‌ ఓటర్లలో ఈసారి సీనియర్‌ సిటిజన్లు 36 శాతం పెరిగారని, యువ ఓటర్లు 33 శాతమే పెరిగారని ఎన్నికల సంఘం చెబుతోంది. రెండో, మూడో తరం వాళ్లంతా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో మొదటి తరం వాళ్లే ఇక్కడ మిగిలారని, అందుకే ఓటర్ల జాబితాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని అక్కడి బీజేపీ సీనియర్‌ నేత వినీత్‌జోషి చెప్పారు. చండీగఢ్‌తో పాటు హోషియార్‌పూర్, జలంధర్, నవాన్‌షార్, కర్తార్‌పూర్‌ జిల్లాలో కూడా వృద్ధులే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. సీనియర్‌ సిటిజన్లతో పాటు ప్రవాస భారతీయులూ ఇక్కడి ఎన్నికలను ప్రభావితం చేయగలరని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు