గంభీర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన అబ్దుల్లా

2 Apr, 2019 18:02 IST|Sakshi

గంభీర్‌-అబ్దుల్లా మధ్య ట్విటర్‌ వార్‌

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్‌, తాజా బీజేపీ నాయకుడు గౌతమ్‌ గంభీర్‌పై కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. జమ్ము కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి కావాలని అబ్దుల్లా చూస్తున్నాడంటూ గంభీర్‌ చేసిన ట్వీట్‌కు ఆయన మంగళవారం రీ ట్వీట్‌ చేశారు. ‘గంభీర్‌, నేను ఎప్పుడూ క్రికెట్‌ ఆడలేదు.. ఎందుకంటే నాకు క్రికెట్‌ గురించి ఎక్కువగా తెలియదు. నీకు జమ్ము కశ్మీర్‌ గురించి తెలియదు. జమ్ము కశ్మీర్‌ చరిత్ర, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చేసిన కృషి గురించి గంభీర్‌కు ఏం తెలుసు. ఇకనైనా గంభీర్‌ తనకు తెలిసిన విషయాలపై మాట్లాడితే మంచిది. తనకు తెలిసిన ఐపీఎల్‌ గురించి ట్వీట్లు పెడితే అందరూ స్వాగతిస్తారు.’అంటూ అబ్దుల్లా గంభీర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. 

అసలేం జరిగిందంటే..
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధానిని నియమించే దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ మరోసారి ప్రయత్నం చేస్తుందన్న ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ గంభీర్ ట్వీట్ చేయడంతో వీళ్ల మధ్య గొడవ ప్రారంభమైంది. ‘ఒమర్‌ అబ్దుల్లా.. జమ్ము కశ్మీర్‌కు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. నేను సముద్రాలపై నడవాలంటే వీలవుతుందా. ఆయనకు విశ్రాంతి కావాలి. ఓ స్ట్రాంగ్‌ కాఫీ తాగి నిద్రపోండి. లేదంటే పాకిస్తాన్‌ పాస్‌పోర్ట్‌ తీసుకోవాలి’అంటూ గంభీర్‌ ఘాటుగా వ్యాఖ్యనించారు. ఇక రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత గంభీర్‌ తన మాటలకు పదును పెడుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా గంభీర్‌ తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.   
 
 

మరిన్ని వార్తలు