ఆర్టికల్‌ 370 రద్దు: సుప్రీంను ఆశ్రయించిన మాజీ సీఎం

10 Aug, 2019 14:06 IST|Sakshi

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఒమర్‌ అబ్దుల్లా

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శనివారం న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. కశ్మీర్‌ను విభజిస్తూ.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కశ్మీరీల అభిప్రాయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని విభజించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. 

ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈనెల 5వ తేదిన పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కశ్మీర్ నేతలు న్యాయశాఖను ఆశ్రయిస్తారని వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం కూడా న్యాయనిపుణలతో చర్చించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా  వ్యూహాలు రచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఒమర్‌ అబ్దుల్లా పిటిషన్‌పై సుప్రీంకోర్టు  ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు