గతంలో బాబు యాత్రకు అనుమతి ఉందా?
ప్రభుత్వం ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలి
సాక్షి, ఒంగోలు: ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి ఉందా అని అడగటం విడ్డూరంగా ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయనిక్కడ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ' వైఎస్ జగన్ కోసం ఊరువాడ ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రకటించగానే ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది.
యాత్రకు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన సమాచారాన్ని డీజీపీకి ఇచ్చాం. ప్రభుత్వం యాత్రను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలు ఇప్పటికైనా మానుకోవాలి. ఆటంకాలు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నందునే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం.' అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.