పాకిస్తాన్‌ టెర్రరిస్టుల ఇండస్ట్రీ..

21 Feb, 2019 03:02 IST|Sakshi

మమత, చంద్రబాబు తోడుదొంగలు: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రదాడి జరిగిందంటే దానికి పాకిస్తాన్‌తో సంబంధం ఉంటుందని, పాక్‌ టెర్రరిస్టుల ఇండస్ట్రీగా మారిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. పుల్వామా దాడితో పాక్‌కు సంబంధం లేదని ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడటం గురివింద గింజ సామెతను గుర్తుచేస్తోందన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనను ముక్తకంఠంతో ప్రజ లంతా ఖండిస్తుంటే మమతా బెనర్జీ, చంద్రబాబు లాంటి వారు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పుల్వామా ఘటన విషయంలో మోదీపై చంద్రబాబు మాట్లాడిన తీరు సిగ్గుచేటన్నా రు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా బాబు, మమత మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఇద్దరూ తోడు దొంగలు..
ఎన్నికలకు ముందు ఉగ్రదాడి జరగడంపై అనుమానాలు ఉన్నాయంటూ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆమెకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. వీరిద్ద రూ తోడు దొంగల్లా ఉన్నారని ఆయన మండిపడ్డారు. ‘దేశంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా పుల్వామా ఘటనను అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ రాష్ట్రాలను పాలి స్తున్న సీఎంలు, బాధ్యత కలిగిన వ్యక్తు లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మమత బాధ్యత మరిచి ఎన్నికల్లో ప్రజల మద్దతు కోసం మోదీనే ఇలా చేయించారంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మమత మాటలపై ప్రజలు ఆలోచించండి అని చంద్రబాబు ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తున్నారు. గోద్రాలో నరమేధా న్ని మరవలేం అని పుల్వామా ఘటనకు ఆయన ముడి వేస్తున్నారన్నారు. దేశ గౌరవానికి భంగం కలిగే విధంగా వీరిరువురి మాటలున్నాయి. వారి మనస్సులోని అభద్రతా భావాన్ని ఈశాన్య రాష్ట్రాలపై రుద్దుతున్నారు. దేశ భద్రత ప్రమాదకరంగా ఉందని బాబు అనడం శోచనీయం’ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌పై షీ టీమ్‌ కేసుపెట్టాలి..
మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్‌ కీలక శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారని, మహిళలు, గిరిజనులు లేకుండా కేబినెట్‌ను విస్తరించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మహిళల పట్ల వివక్ష చూపుతున్నందుకు సీఎం కేసీఆర్‌పై షీ టీం కేసు పెట్టాలన్నారు. 

మరిన్ని వార్తలు