‘రియల్‌’ వ్యాపారం దెబ్బతిందనే టీడీపీ బాధ

21 Dec, 2019 11:14 IST|Sakshi
మాట్లాడుతున్న వెంకటేగౌడ

రాజధాని నిర్మాణం పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టారు  

మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి

పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ

పలమనేరు :  ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అండ్‌ కో అమరావతిలో చేపట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మునిగిపోయిందనే ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, నిజంగా వారికి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టే లేదని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ విమర్శించారు. పలమనేరులోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ఎలాంటి ప్రత్యేక ఉద్యమాలకు తావు లేకుండా సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీన్ని రాష్ట్రంలోని ప్రజలు, మేధావులు స్వాగతిస్తుంటే టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదన్నారు. రాజధాని నిర్మాణంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. తాత్కాలిక భవనాలు కట్టి రూ.5వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. రైతులను బెదిరించి అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకున్నారని, వారికి వెంటనే వెనక్కు ఇచ్చేస్తామని చెప్పడంతో చంద్రబాబుకు దిక్కుతోడం లేదని అన్నారు. రాజమౌళి గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టి చేసిన రాజకీయం బెడిసికొట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధి సాధిస్తాయని ఇప్పటికే మేధావులు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ పలమనేరు పట్టణ, గంగవరం కన్వీనర్లు మండీసుధా, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు