ఉభయసభల్లో హోదా పోరు

14 Mar, 2018 01:06 IST|Sakshi
పార్లమెంట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీల నిరసన

వైఎస్సార్‌సీపీ ఎంపీల నిరసనలతో పార్లమెంట్‌ పలుమార్లు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయటం తోపాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు మంగళవారం ఉభయ సభలతో పాటు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన కొనసాగించారు. ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలపటంతో పలుమార్లు వాయిదా పడ్డాయి. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగ పల్లి వరప్రసాదరావు, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఉదయం 10.30కి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీలు మేకపాటి రాజ మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద రావు, వై.ఎస్‌.అవినా ష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైతే టీడీపీ కనీసం మద్దతు ఇవ్వటానికి కూడా ముందుకు రావటం లేదని విమర్శించారు. 

అందరి మద్దతు కూడగడతాం
‘వారు (టీడీపీ) ఎన్డీఏ భాగస్వామిగానే కొనసాగుతామని చెబుతున్నారు. లోపలొక సినిమా, బయటొక సినిమా చూపిస్తున్నారు. మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం. విభజన హామీలు నెరవేర్చాలని అడుగుతున్నాం. ఈనెల 21న అవిశ్వాస తీర్మానం పెడతాం. అప్పటికీ దిగిరాకుంటే బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున రాజీనామాలు చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతాం.  రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు  అందరినీ అభ్యర్థిస్తున్నాం. ప్రతిపక్షాలన్నింటిని కోరతాం. అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లను కలుస్తాం’ అని పేర్కొన్నారు. 

ఉభయ సభల్లో నోటీసులు
వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హోదాపై చర్చకు వీలుగా లోక్‌సభ  కార్యక్రమాలు వాయిదా వేయాలని వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.రాజ్యసభలో ఇదే అంశంపై ఎంపీ వి.విజయసాయిరెడ్డి సావధాన తీర్మానానికి నోటీసులు ఇచ్చారు

>
మరిన్ని వార్తలు