వెన్నుపోటు పొడిచింది టీడీపీ, బీజేపీలే..

27 Mar, 2018 01:48 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 కోట్ల ప్రజలను నట్టేట ముంచాయి

29సార్లు ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏం సాధించారు

ఎన్నికల్లో ప్రజలు నమ్మరన్న భయంతోనే చంద్రబాబు నాటకాలు

వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి

సాక్షి,  హైదరాబాద్‌: రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి 5 కోట్ల మంది ఆంధ్రులను దారుణంగా మోసగించింది తెలుగుదేశం, బీజేపీలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈ దారుణ మోసంలో ఎవరి పాత్ర ఎక్కువ అనేది మాత్రం ఆ పార్టీలే తేల్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరకుండా నాలుగేళ్ల పాటు స్వలాభం కోసం స్వార్థంతో బీజేపీతో అంటకాగి కుట్రలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంటే జనం ఎలా నమ్ముతారనుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్థసారథి మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చానని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

వీరి నటన ముందు ఆస్కార్‌ నటులూ సరిపోరు
ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అద్భుతంగా నటిస్తున్నారని, వీరి నటన ముందు ఆస్కార్‌ అవార్డు పొందిన సినీ నటులు కూడా సరిపోరేమోనని పార్థసారథి ఎద్దేవా చేశారు. వీరేదో ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేసినట్లు.. సాధించలేక ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లుగా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు అబ్బ సొత్తు కాదని, ఐదు కోట్ల మంది ప్రజల గడ్డని పార్థసారథి వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న వివాదాన్ని చంద్రబాబు రాష్ట్రానికి ముడిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు