-

‘ఫిరాయింపులకు’ ఓటమి

12 Dec, 2018 01:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత సార్వత్రిక ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో 25 మంది వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరగా అందులో 20 మంది విజయం సాధించారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం భంగపాటు ఎదురైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాయం వెంకటేశ్వర్లు పినపాక నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓడగా, అశ్వరావుపేట నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు కూటమి అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావు చేతిలో, వైరాలో బానోతు మదన్‌లాల్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థి రాముల్‌నాయక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

గతంలో ఇల్లందులో కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన కోరం కనకయ్య ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి హరిప్రియ చేతిలో ఓడారు. మహేశ్వరంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దొంతి మాధవరెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు