కిడ్నీ బాధితుల కోసం పవన్‌ 24 గంటల దీక్ష

26 May, 2018 02:18 IST|Sakshi
దీక్షలో పుస్తకం చదువుతున్న పవన్‌కల్యాణ్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ 24 గంటల దీక్షకు దిగారు. ఎచ్చెర్ల మండలంలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు దీక్ష ప్రారంభించారు. శనివారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కాగా, శనివారం నాటి దీక్ష శ్రీకాకుళం పట్టణంలో ఉ.9గంటలకు ప్రజల సమక్షంలో కొనసాగిస్తారని జనసేన మీడియా ఇన్‌చార్జి హరిప్రసాద్‌ మీడియాకు చెప్పారు.

కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్‌ కల్యాణ్‌ 17 డిమాండ్లతో కూడిన ప్రకటన విడుదల చేశారని.. ఇందులో భాగంగా ఆరోగ్య ఎమర్జెన్సీ విధించాలని, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి నేరుగా దీనిని పర్యవేక్షించాలనే ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వ స్పందన లేదన్నారు. కిడ్నీ వ్యాధితో జిల్లాలో రోజుకు ఒకరు మృత్యువాత పడుతున్నా సర్కార్‌ పట్టించుకోవడంలేదని హరిప్రసాద్‌ ఆరోపిం చారు. సాంకేతికంగా ప్రగతి సాధించిన ఏపీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రధాన సమస్యగా మారిందన్నారు. కాగా, శనివారం సాయంత్రం పవన్‌కల్యాణ్‌ దీక్ష ముగిసిన తరువాత ప్రజాపోరాట యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు