దమ్ముంటే చేయ్‌.. లోకేశ్‌కు పవన్‌ సవాల్‌

8 Jul, 2018 16:21 IST|Sakshi


సాక్షి, విశాఖపట్నం :  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే లోకేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ మీద జనసేన తరఫున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్‌ అన్నారు. దొడ్డిదారిన లోకేశ్‌ను మంత్రిని చేశారని, ఆయనను సీఎం చేయాలని చూస్తే ఊరుకోబోమని పవన్‌ హెచ్చరించారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏ సమస్యపైనైనా చర్చించేందుకు తాను సిద్ధమని, తనతో లోకేశ్‌ బహిరంగ చర్చకు రావాలని పవన్‌ పేర్కొన్నారు.

విశాఖ రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో పవన్‌ కల్యాణ్‌ జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గతంలో తన ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. పాయకరావుపేటకు చెందిన మృతుడు శివ తల్లిదండ్రులకు రూ. లక్షన్నర, ఆయన భార్యాపిల్లలకు రూ. రెండున్నర లక్షలు పవన్‌ అందజేశారు. మరో మృతుడు తోళం నాగరాజు భార్యాపిల్లలకు రూ. మూడు లక్షల చెక్‌ను అందించారు. గతంలోనూ మృతుల కుటుంబాలకు రూ. మూడు లక్షల ఆర్థిక సాయాన్ని పవన్‌ అందజేశారు.

మరిన్ని వార్తలు