నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు

24 May, 2020 05:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో జనసేన పార్టీ మీడియా విభాగం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జనసేనలో ఉండే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే.

ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున.. మరోసారి ఈ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను’ అని పేర్కొన్నారు. జనసేన అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని, వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు