గుడి దగ్గర భిక్షాటన చేసుకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది

10 Jun, 2019 04:25 IST|Sakshi

ఓటుకు రెండు వేలు ఇచ్చారంటూ పార్టీ అంతర్గత సమావేశంలో పవన్‌ వ్యాఖ్య

సాక్షి, అమరావతి: ఓటు అమ్ముకోవడం కంటే భిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కొంత మందిని అడిగాను ఓటుకు ఎంతిచ్చారు అని. రూ.2 వేలు అని చెప్పారు. రూ.2 వేలను ఐదేళ్లకు విభజిస్తే రోజుకు రూపాయి వస్తుంది. గుడి దగ్గర భిక్షాటన చేసుకునే వారికి కూడా అంతకంటే ఎక్కువే వస్తాయి’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ మీడియా విభాగం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

గడిచిన ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని తాను ఆశించలేదని జనసేన అధినేత అన్నారు. ఓటమి ఎదురైనప్పుడే ఎవరు నిలబడతారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకు జనసేన పార్టీని మోస్తానని, ఇక ముందు కూడా బలంగా నిలబడతానని, అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక్కడి నుంచి అంతా వెళ్లిపోయినా తాను ఒక్కడినే నిలబడతానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేమో చూస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ తన ఆశయాలనే చూశారని, ఇకపై తన రాజకీయ ఎత్తుగడలు చూపిస్తానని చెప్పారు.    

మరిన్ని వార్తలు