పలాస రోడ్షోలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే పనిగా పెట్టుకున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మూడో రోజైన మంగళవారం పలాస–కాశీబుగ్గ పట్టణంలో పవన్కల్యాణ్ రోడ్షో నిర్వహించారు. అంతకముందు హరిశంకర్ థియేటర్ వద్ద కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని, వారు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలను తమ పార్టీ వెలుగులోకి తెచ్చేవరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు మొద్దునిద్ర పోయారని విమర్శించారు.
సీపీఎస్ విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో భృతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పార్టీ నాయకులు డాక్టర్ దుర్గారావు, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ 45 రోజులు పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తగిన భద్రత కల్పించాలంటూ జనసేన పార్టీ నేతలు బుధవారం డీజేపీని కలవనున్నారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ కన్వీనర్ రాఘవయ్య ఆధ్వర్యంలో జనసేన బృందం ఉదయం 11 గంటలకు మంగళగిరిలో డీజీపీ మాలకొండయ్యను కలవనున్నట్టు పేర్కొన్నారు.