పవన్‌తో బండి సంజయ్‌ భేటీ

25 May, 2020 19:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసంలో సోమవారం సాయంత్రం వీరు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తుండగా.. ఈ పొత్తును తెలంగాణలోనూ కొనసాగించాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పవన్‌, సంజయ్‌ భేటీ అయినట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు వీరి భేటీలో రాజకీయ కోణం ఏదీ లేదని, కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. (నాగబాబు ట్వీట్లపై స్పందించిన పవన్‌)

కాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర సారథిగా సంజయ్‌ బాధ్యతలు స్పీకరించిన తరువాత ట్విటర్‌ ద్వారా పవన్‌ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్‌-సంజయ్‌ భేటీపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సంజయ్‌ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఇక ఢిల్లీ కేంద్రంగా జనసేన-బీజేపీ పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని జసేన-బీజేపీ నేతలు అధికారికంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు