రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

6 Jun, 2019 19:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన గురువారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. భవిష్యత్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పార్టీ కోసం పనిచేసేవారందరూ ఒకే తాటిపైకి రావాలని ఉద్బోధించారు. ఈ ఎన్నికల్లో ఓటమిని అనుభవంగా తీసుకోవాలని, పార్టీ నేతలు స్వీయ విశ్లేషణ చేసుకోవాలన్నారు.

తాను గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోవడంతో ఓటమి ఎదురైనట్టు పవన్‌ కళ్యాణ్‌ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీని త్వరలో పునర్నియామకం చేయనున్నట్టు వెల్లడించారు. పార్టీ నిర్ణయాలను ఎప్పటికప్పుడు కార్యకర్తలకు తెలియజేసేందుకు పక్ష పత్రికను వెలువరించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు