సాక్షి, కరీంనగర్: తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు.
‘ఆంధ్ర నాకు జన్మనిస్తే.. తెలంగాణ నాకు పునర్జన్మను ఇచ్చింది. ప్రమాదం నుంచి నన్ను కాపాడి కొండగట్టు ఆంజనేయుడు పునర్జన్మను ఇచ్చాడు. అందుకే తెలంగాణ నుంచి నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాను. తెలంగాణ నేల తల్లికి ఆఖరి శ్వాసవరకు రుణపడి ఉంటాను. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై తెలంగాణ కూడా అలాంటి గొప్ప మహావాక్యం. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు మాత్రం సంవత్సరం తర్వాత వచ్చింది. దేశమంతా పండుగ జరుపుకుంటే.. తెలంగాణ ఇంకా మా స్వేచ్ఛ ఎప్పుడు అనుకుంటూ గడిపింది. ఆ ఆ సమయంలో గుండెల్లో మార్మోగిన నినాదమే జై తెలంగాణ. తెలంగాణలోని కరీంనగర్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు.