జేపీ, జేడీలకు లేని ఆంక్షలు నాకెందుకు: పవన్‌

28 Sep, 2018 16:37 IST|Sakshi
పవన్‌ కల్యాణ్‌

కొల్లేరు(పశ్చిమగోదావరి జిల్లా) : జయప్రకాశ్‌ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరుకు వచ్చినపుడు లేని ఆంక్షలు తాను వచ్చినపుడే ఎందుకు పెడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. కొల్లేరులో యాత్రకు కట్టుబాట్లు విధించడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ మత్స్యకారులు అవినీతి రాజకీయ పార్టీల కుట్రల మధ్యలో నలిగిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం చేస్తానని తానంటే ఇక్కడి నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే తన వద్దకు రావద్దని, రాకుండా కట్టుబాట్లు విధించారని ఆరోపించారు.

గత రాత్రి తనపై దాడి చేయడానికి కూడా వచ్చారని తెలిపారు. తాను చేతులు కట్టుకుని కూర్చోనని, తన సంగతి తెలుసు కదా మక్కెలు ఇరగదీస్తానని హెచ్చరికలు పంపారు. తన మీద దెబ్బ పడేకొద్దీ తాను ఎదుగుతానే తప్ప తగ్గనని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయితే రూ.110 కోట్లు పెట్టి కొల్లేరులో రెండు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. తనను గెలిపించకపోయినా పర్వాలేదు గానీ, తన వెనక ఉండండి చాలు పోరాడి సాధించుకుందామని కొల్లేరు పర్యటనలో పవన్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు