సంఖ్యాబలం ఉన్నా అభ్యర్థి కరువు

5 Jun, 2019 01:55 IST|Sakshi

బీసీ మహిళ లేక చేజారనున్న ఎంపీపీ పదవి! 

దోమకొండలో కాంగ్రెస్‌కు విచిత్ర పరిస్థితి

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఐదింటిలో విజయం సాధించగా.. టీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలకే పరిమితమైంది. అయితే అత్యధిక స్థానాలను గెలిచిన ఆనందం కాంగ్రెస్‌ పార్టీకి లేకుండాపోయింది. దోమకొండ ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు బీసీ మహిళలూ ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పార్టీకి ఎంపీపీ అభ్యర్థి లేకుండా పోయారు. ఎంపీపీ పీఠం కైవసం చేసుకునే సంఖ్యాబలం ఉన్నా.. ఎంపీపీ పదవి కోసం బీసీ మహిళ లేకపోవడంతో ఆ పదవిని వదులుకునే పరిస్థితి వచ్చింది.  

అన్నాసాగర్‌లో ఒకే ఒక్కటి 
ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్‌ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హన్మన్నగారి శ్రీనివాస్‌రెడ్డికి ఒకే ఒక్క ఓటు దక్కింది. ఆయనకు కూలర్‌ గుర్తు కేటాయించారు. అయితే మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో శ్రీనివాస్‌రెడ్డికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. మరో స్వతంత్ర అభ్యర్థి జంగింటి ఉమాదేవి 1,005 ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. 661 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోలి వసంతం రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చిలుక నర్సింలుకు 263 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి 32 ఓట్లు పోలయ్యాయి. 

>
మరిన్ని వార్తలు