వెంటిలేటర్‌పై టీడీపీ ప్రభుత్వం

6 Jul, 2018 09:16 IST|Sakshi

నాలుగేళ్లలో సీఎం చేసింది శూన్యం, ప్రగతి ప్రకటనలకే పరిమితం  

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పీలేరు: ఆచరణకు సాధ్యకాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఆరు వందల హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన బాబు ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. నూతన రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని నాలుగేళ్లుగా చెప్పిందే చెబుతూ ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప ఇప్పటివరకు శాశ్వత ప్రాతిపదికన ఒక్క నిర్మాణం చేపట్టిన దాఖలాలులేవని దుయ్యబట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యేక హోదా తోనే సాధ్యమన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం ఆ కేసు నుంచి తప్పించుకోవ డం కోసం హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించా రు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకోవడానికే విదేశీ పర్యటన చేశారు తప్ప పరిశ్రమల ఏర్పాటు కోసం కాదని చెప్పారు. నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు యూ టర్న్‌ తీసుకుని వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా,కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌ గురించి పట్టించుకోకుండా ఇప్పుడు దొంగ దీక్షలతో తానేదో ఉద్ధరిస్తానని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం జాడ కానరావడంలేదని దుయ్యబట్టారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రతో టీడీపీ ప్రభుత్వం పతనం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ వైఫ ల్యాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని సూచిం చారు.

మరిన్ని వార్తలు