నియంతలా వ్యవహరిస్తున్న సీఎం 

28 Sep, 2017 03:47 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి

పీలేరు: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన పీలేరులో పర్యటించారు. ఈ సందర్భంగా గాయం వారిపల్లెలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం లేకుండా చేస్తానంటూ సీఎం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం వారి అహంభావానికి నిదర్శనమన్నారు. ప్రజలు ఏది కోరుతున్నారో వాటినే అమలు చేయడంలో వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ ముందుంటుందని తెలిపారు. ప్రజలతో మమేకం కావడం, వాటి ఇబ్బందులు తెలుసుకోవడం, అండగా ఉండడం కోసం ఇంటింటికీ వైఎస్సార్, వైఎస్సార్‌ కుటుంబం తదితర కార్యక్రమాలు వినూత్నంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

బాబు మాటలు నమ్మి 2014లో ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారని, అధికారంలోకి వచ్చాక రైతులు, డ్వాక్రా మహిళలను తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరిట ఏడాదికి మూడు పంటలు సాగయ్యే సారవంతమైన భూములను రైతుల నుంచి లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. టీడీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా వుంటుందని బరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు