సాక్షి, తిరుపతి : లాటరైట్ మైనింగ్పై ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లడానికే చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియాతో కట్టుకథలు ప్రసారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో లాటరైట్స్ లీజుల్లో అక్రమాలు జరిగినట్లు ఎల్లో మీడియా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అసత్యాలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.
కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలోనే ఈ లీజులు ఇచ్చారని పేర్కొన్నారు. కెమికల్ అనాలసిస్ కోసం గతేడాది జులై నుంచి మైనింగ్ తవ్వకాలు ఆపేశామని, బాక్సైట్ నిక్షేపాలు కాదని తేలడంతో ఈ ఏడాది మే నుంచి తిరిగి అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. సరస్వతి సిమెంట్ విషయంలో కూడా తప్పుడు కథనాలు ప్రసారం చేశారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.