మోదీకి భయపడే నోరు మెదపడం లేదు

20 Feb, 2018 01:54 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి.. చిత్రంలో పార్థసారధి

చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే సీఎం చంద్రబాబు నోరుమెదపడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధితో కలిసి మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి మేం సిద్ధమని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తున్నా.. వారికి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామని ప్రకటిస్తుంటే కేంద్రంలో మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారన్నారు.  

రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రంతో లాలూచి పడ్డారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అన్నారని..తీరా అధికారంలోకి వచ్చాక సొంత ప్రయోజనాల కోసం హోదాని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి 9 మంది ఎంపీలు గెలుపొందగా అందులో నలుగురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు.

చంద్రబాబు తన ఎంపీలతో కలిసి వస్తే మేం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్‌.జగన్‌ ప్రకటించినా.. మద్దతు తెలిపేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అఖిపక్షం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నా...అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని ఇప్పుడు బాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

మరిన్ని వార్తలు