లక్నో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని శనివారం లక్నో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసింది. అయితే ఆ సమయంలో కాన్వాయ్ నుంచి దిగిన ఆమె.. రిటైర్డు ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి ద్విచక్రవాహనంపై వెళ్లారు. దీనిపై ఆదివారంసీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆయన వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్ లేదని జరిమానా విధించారు. రూ.6100 జరిమానా వేస్తున్నట్లు లక్నో ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో దారాపురిని పోలీసులు అరెస్ట్చేశారు.
కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సందర్భంలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంక బయలుదేరారు. అయితే ఆమె వెళ్లడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారు. ఈ సమయంలో తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు.