చిరు జల్లుల మధ్య చెరగని జనాభిమానం

2 Jul, 2018 01:57 IST|Sakshi
మురమళ్ల వద్ద గోదావరి వంతెనపై అశేష జనవాహిని మధ్య వైఎస్‌ జగన్‌ , తూర్పుగోదావరి జిల్లా అన్నంపల్లి క్రాస్‌ వద్ద వర్షంలో తడుస్తూనే పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌

తడిసి ముద్దయినా జననేత అడుగులో అడుగేసిన జనం 

పూలబాటతో స్వాగతాలు 

వణుకుతూనే వచ్చిన వృద్ధులు..  

నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనంటూ వాపోయిన వివిధ వర్గాల ప్రజలు 

మన ప్రభుత్వం రాగానే కష్టాలన్నీ తీరతాయని జననేత భరోసా 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అయ్య బాబోయ్‌.. వర్షంలో తడిసిపొయ్యాడు. అయినా పాదయాత్ర శాత్తన్నాడు. వచ్చిన పెతోళ్లనీ పలకరిత్తన్నాడు. ఇదిగో సూడు.. ఫొటో కూడా దిగా...’ అని సౌభాగ్యమ్మ అనే మహిళ జగన్‌ను కలిశానని తోటి మహిళలతో ఆనందం పంచుకుంది. ‘మన కోసం ఆ బాబే అట్టా తడవంగలేందీ.. మనం తడిత్తే ఓ లెక్కా.. పోదాం పదరా... ఒక్కసారి కలిసొద్దాం’ అంటూ పోలినాయుడు అనే వృద్ధుడు మనవడ్ని తొందరపెట్టాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 202వ రోజు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మొదలుకొని రాజుపాలెం, నడిమిలంక క్రాస్, అన్నంపల్లి క్రాస్, మురమళ్ల్ల, కొమరగిరి వరకూ సాగిన జగన్‌ పాదయాత్రలో ఇలాంటి దశ్యాలెన్నో. జగన్‌ నినాదంతో మార్మోగని ఊరులేదు. అభిమాన నేత కోసం బారులు తీరని వీధిలేదు. గజానికో ఫ్లెక్సీ... ప్రతీ మలుపులోనూ మంగళహారతులు.. అడుగడుగునా స్వాగత తోరణాలు.. కోనసీమలో జాతర జరుగుతున్నట్టుగా ఉంది. సెల్ఫీ దొరికితే చాలనుకునే యువతరం.. నోరార పలకరించాలని ఆరాటపడే అవ్వాతాతలు.. విజయం తథ్యమని చెప్పాలని పోటీపడ్డ మహిళాలోకం.. ఇలా వివిధ వర్గాల ప్రజలు చిరు జల్లుల్లో తడుస్తూనే జననేతను చూడటానికి భారీగా తరలివచ్చారు.  
 
చిరుజల్లుల దరహాసం.. 
ముమ్మడివరంలో పాదయాత్ర మొదలవుతుండగానే మేఘాలు అలుముకున్నాయి. రెండు కిలోమీటర్ల మేర యాత్ర సాగగానే చిటపట చినుకులు మొదలయ్యాయి. అది కూడా ఎదురు జల్లు. జగన్‌ తడిసిపోయారు. తలపై నుంచి ముఖం మీదుగా వర్షపు నీరు జారుతోంది. చొక్కా పూర్తిగా తడిపోయింది. అయినా ఆయన అదేదీ పట్టించుకోకుండా జనాన్ని కలిశారు. అవ్వాతాతల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను ఆప్యాయంగా పలకరించారు. చిరునవ్వుతో చిన్నారులను దగ్గరకు తీసుకున్నారు. తడిసిపోతున్న జగన్‌ను చూసి అభిమానులు గొడుగు పట్టుకునే ప్రయత్నం చేయగా, ఆయన వద్దని వారించారు. ఆ పట్టుదల, ప్రజలతో మమేకమవ్వాలనే ఆకాంక్ష ముందు వర్షం కూడా ఓడిపోయినట్టు.. కొద్దిసేపటికి తెరపిచ్చింది.  
 
వణుకుతూ వచ్చిన అవ్వాతాతలు.. 
ముమ్మడివరం శివారులో లలితమ్మ, అప్పలరాజు అనే అవ్వాతాతలు.. మురమర్ల దగ్గర వయో వృద్ధులు రాజునాయుడు, యశోదమ్మలు.. ఇంకో చోట మరికొంత మంది.. వర్షంలో తడిసి ముద్దవుతూనే జగన్‌ కోసం ఎదురు చూశారు. ఓ వైపు చల్లటి గాలికి వణుకుతూనే జననేతను కలవాలని తాపత్రయపడ్డారు. ‘ఒక్క రోజు తడిస్తే ఏమైందయ్యా.. ఆయన మళ్లీ మళ్లీ ఇంత దగ్గరగా వస్తాడా? అని ప్రశ్నించారు. అంతలో జగన్‌ అక్కడికి వచ్చారు. అక్కడున్న వయోవృద్ధులనందరినీ దగ్గరకు పిలిపించుకున్నారు. ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని సమస్యలు తెలుసుకున్నారు. మన ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘ఆ భరోసా చాలయ్యా.. వాళ్ల నాన్న చెప్పినవన్నీ చేశాడు. ఈయనా చేస్తాడు’ అని 62 ఏళ్ల రైతు ఈశ్వర ప్రసాద్‌ జగన్‌ను కలిసిన తర్వాత చెప్పాడు.  
 
కోనసీమ జగన్‌ వెంటే.. 
వృద్ధ గౌతమి వద్ద రాఘవేంద్ర వారధి దాటుతూ జగన్‌తో నడుస్తున్న జనం జేజేలు పలికారు. కోనసీమ మీ వెంటే ఉంటుందని నినదించారు. ముమ్మడివరం దగ్గర ఎయిమ్స్‌ కాలేజీ విద్యార్థులు పూలబాట పరిచి మరీ జగన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాంతికిరణ్‌ అనే యువతి మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో తప్పు చేశాం. కోనసీమ పశ్చాత్తాపడుతోంది. ఇక తిరుగే లేదని, జగన్‌ విజయం తథ్యమనే సంకేతాలివ్వడానికే వచ్చాం’ అని చెప్పింది. ‘చంద్రబాబు మోసాలు తెలిసొచ్చాయి. ఇక దగ్గరకు కూడా రానివ్వం. కోనసీమ జగన్‌ వెంట కదిలొస్తుంది’ అంటూ కొమరవెల్లి దగ్గర ఆక్వా రైతు దొరనాయుడు చెప్పాడు.   
ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారన్నా.. 
తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లరేవు మండలం గాడిమొగ, పి.మల్లవరం గ్రామాల పరిధిలో ఉన్న ఓఎన్‌జీసీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగులను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. 450 మంది పని చేస్తుంటే ఇప్పటి వరకు దాదాపు 100 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన రొయ్యల సీడ్‌ను సరఫరా చేయక పోవడంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ ఐలాండ్‌ యాచరీస్‌ అసోసియేన్‌ తరఫున భూపతిరాజు, వెంకట సుబ్రహ్మణ్యంరాజు, మంతెన సుబ్బరాజు, పెన్మత్స కృష్ణంరాజు, డి.రాఘవరాజు తదితర రైతులు మురమళ్ల గ్రామ సమీపంలో జగన్‌ను కలిసి తమ కష్టాలను విన్నవించారు. ఎయిడెడ్‌  కళాశాలల్లోని పార్ట్‌ టైం లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలని ఆసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు టి.సుందరరామయ్య జననేత జగన్‌కు వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో 769 మంది పార్ట్‌టైం కింద పని చేస్తున్నారని, వీరికి నెలకు కేవలం రూ.6 వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారని వాపోయారు. ఆటో డ్రైవర్లు వారి కష్టాలు చెప్పుకున్నారు. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్ఫోరేషన్‌ (జీఎస్‌పీసీ) చేపడుతున్న డ్రిల్లింగ్‌ పనుల వల్ల నష్టపోతున్న బాధిత మత్స్యకారులకు పరిహారం చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాలెపు ధర్మారావు, బాబూరావు, లక్ష్మినరసింహరాజు తదితరులు ప్రతిపక్షనేతకు వినతిపత్రం ఇచ్చారు. పింఛన్లు తొలగించారని, ఇళ్లు మంజూరు చేయలేదని దారిపొడవునా పలువురు జననేతకు ఫిర్యాదు చేశారు. వారందరి సమస్యలు ఓపికగా విన్న జగన్‌.. మన ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.   

>
మరిన్ని వార్తలు