ఏపీ ఓటర్లే.. అప్పుడు తెలంగాణలో ఓటేశారు 

19 Mar, 2019 12:46 IST|Sakshi

ఏపీలో విలీనమైన కూనవరం, చింతూరు, వీఆర్‌ పురం, ఎటపాక, వేలేరుపాడు, కుకునూరు, భద్రాచలం పట్టణం మినహాయించి.. మండలంలోని అన్ని గ్రామాల ఓటర్లు 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఓటేశారు. వేలేరుపాడు, కుకునూరు మండలాల ఓటర్లు అశ్వారావుపేట, మిగిలిన మండలాల వారు భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించారు. 2014 ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరిగింది. అయితే, ఆ మండలాలను ఎన్నికల అనంతరం ఏపీలో విలీనం చేశారు.

కూనవరం, చింతూరు, వీఆర్‌ పురం, ఎటపాక మండలాలను తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం (ఎస్టీ) నియోజకవర్గంలో కలపగా.. వేలేరుపాడు, కుకునూరు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం (ఎస్టీ) నియోజకవర్గంలో కలిపారు. ఆ మేరకు 2014 జూలైలో ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. రాష్ట్రపతి ఆమోద ముద్రతో 2015 ఏప్రిల్‌ 23న కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఆయా మండలాలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగంగానే గుర్తిస్తూ వచ్చింది. 

చివరకు, తెలంగాణ ఎన్నికలకు ముందు అంటే.. 2018 సెప్టెంబర్‌ 22న ఆయా మండలాలు రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో కలుపుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఈవో జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచనలతో ఆయా మండలాలను ఏపీలోని రెండు నియోజకవర్గాల్లో కలుపుతూ 2008 నాటి నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్‌కు సవరణ చేపడుతూ సీఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే సమయంలో ఆయా గ్రామాలకు చెందిన ఓటర్ల ఓటు హక్కుపై తలెత్తిన సాంకేతిక సమస్యలు తొలగిపోయాయి. విలీన గ్రామాల ఓటర్లు తమ హక్కును ఇకనుంచి ఏపీలోనే వినియోగించుకుంటారు. 
– ఎలక్షన్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు